Wednesday, February 29, 2012

purushaarthaalu - artham


అర్థం, అర్థ-కామ-ధర్మ-మోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థాలలో మొదటిది.

మన ఋషులు మనం చెసే ప్రతి పనియొక్క పరమార్థం (ఏ ప్రయోజనం/లాభం కోసం ఆ పని చెస్తున్నాము) బట్టి, ఆ పనులని నాలుగు విధాలుగా విభజించారు; అవే పురుషార్థాలుగా పిలవబడుతున్నాయి.

ప్రాణం ఉన్న ప్రతిజీవి ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మృత్యువు నుంచి తనను తాను కాపాడుకొనడంలో ఆ ప్రాణి చేసే ప్రతి కర్మ లెదా పనిని ఆర్థ-పురుషార్థం గా పరిగణిస్తాం.

ఈ అభద్రత అనేది, అనేక రకాలుగా వుంటుంది. ఆకలి, దాహం, ఛలి, ఎండ, వర్షం; ఇలాగ ఎన్నో అభద్రతలు ప్రతి ప్రాణి ఎదుర్కొంటుంది ప్రతి నిముషం. వీటితోపాటే తన వంశాన్ని నిలబెట్టుకొవడానికి చేసే వివాహ లెదా సంసార కర్మ (పని) కూడా ఆర్థ పురుషార్థం కిందకే వస్తుంది.

ఈ సాధారణ అభద్రతకి మించిన ఏ కర్మ అయినా కామం అనే రెండవ పురుషార్థంగా పరిగణింపబడుతుంది. ఉదాహరణకి తన శరీర పొషణార్థం తీసుకునె ఆహారం అర్థం అయితె, తన జిహ్వ (రుచి) సంత్రుప్తికోసం తీసుకునే ఆహారం కామం అవుతుంది.

వ్యక్తి చేసే ఏ కర్మ అయినా, అది తన అర్థ పురుషార్థం కోసరం అయినా సరే, ధర్మం అనే మూడవ పురుషార్థానికి లోబడే జరగాలి. ఈక్కడ ప్రాణులని కర్త(లు) అని, భోక్త(లు) అని రెండు రకాలుగా విభజించారు మన ఋషులు. విచక్షనా జ్ఞానం కల మనుష్యులందరు కర్తలు అయితే, విచక్షనా జ్ఞానం లెని పక్షి, జంతు, వృక్ష గణాలన్ని భోక్తలుగా పిలవబడ్డాయి. ఈ భోక్తలు తాము చెసే పనులను (విలాస, వినోద, మైధునాలతో సహా - పక్షులు, జంతువులు ఇంకా వృక్షాలు కూడా వినోదం మరియు వుల్లాసం కోసం ఆటలాడడం మనం చూస్తూవుంటాము, జీవితంలో) ఏ మాత్రం కర్తృత్వ భావన లెకుండా (నేను ఈ పని చెస్తున్నాను అనె జ్ఞానం/ఆలొచన/భావన) చెస్తాయి కనుక వాటికి ఈ ధర్మం అనేది వర్తించదు. ఇదే కాకుందా ఈ భోక్తలు తమమీద ఆరొపింపబడ్డ కర్మలని తప్పించుకోలెక పొవడం (పశు, వృక్ష, జంతు పాలన ఇంకా బానిసత్వం) అనేది కూడా ఈ మినహాయింపుకు కారణం.

ఈ అర్థ పురుషార్థాన్ని వ్యక్తి స్థాయి నుంచి ఒక సంఘం స్థాయికి తీసుకు వెళితే దాన్ని ఈ ఆధునిక కాలంలో మనం పిలిచే దేశ సంరక్షన, భద్రత అనే భావన అవుతుంది. ఏ ప్రభుత్వ పాలన యొక్క పరమావధి అయినా తన దేశం/సంఘం లొని వ్యక్తుల సమిష్ఠి భద్రత మాత్రమె. ఈ భద్రత అనేది ఎన్నొ రకాలుగా వుంటుంది- సాంఘిక, భౌగొళిక, వారసత్వ, సంస్కృతిక, ఇంకా ఎన్నొ. అందుకే ఆర్య చాణక్య ఇలా అంటాడు తన అర్థశాస్త్రంలొ - "మనుష్యాణాం వ్రుత్తి: ఆర్ఠ:, మనుష్యవతీ భూమిరిత్యర్థ:, తస్యా: ప్రుథివ్యా: లాభపాలనోపాయ: శాస్త్రం ఆర్ఠశాస్త్రం ఇతి (15వ అధికరణం, 1వ శ్లోకం)" అంటే, మనుష్యుల జీవనోపాధి అర్థం. అనగా మనుష్యులున్న భూమి అని అర్థం (దేశమంటే మట్టి కాదొయ్, దేశమంటే మనుషులోయ్ - గురజాడ). ఆ భూమిని పొందడానికి, పాలించడానికి తగిన ఊపాయాన్ని చెప్పే శాస్త్రం అర్థశాస్త్రం.

ఏ ప్రభుత్వ/రాజరిక వ్యవస్థ అయినా ఈ అర్థ-పురుషార్థానికే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్త విశ్వంలో ఉన్న అన్ని వనరులు ఎకమైనా కనిసం ఒక్క మనిషియొక్క కోరికలని కూడా సంత్రుప్తిపరచలెవు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా అవి ఆ దెశంలొని ప్రజల కోరికలని తీర్చలెక పొతున్నాయి.

మరి వివేకవంతుడైన మనిషి ఈ అర్థ పురుషార్థాన్ని దాటే మార్గం ఏమిటి? దానికి మనం మనిషియొక్క జీవితం అనే మూలానికి వెళ్ళాలి. మనం ఈ జీవితాన్ని ఈ పుట్టుక మరియు చావు/మృత్యువు ల మధ్యలో వుండే కాలం గా భావించినంత కాలం మనం ఈ అర్థ పురుషార్థానికి బానిసై ఉండాలి. ఈ జీవితం యొక్క నిర్వచనం మార్చినప్పుడే మనం అర్థ-పురుషార్థాన్ని దాటగలుగుతాం.

మనం హిందు-ఇజం అని పిలుచుకునె మన సనాతన ధర్మం మన జీవితాన్ని ఆత్మ-స్వరూపం గా నిర్వచిస్తోంది. ఈ ఆత్మ తత్వాన్ని అర్థం చెసుకుని, మన ఆత్మ-స్వరూపాన్ని తెలుసుకోగలిగినప్పుడు అది మోక్షం అనే నాలగవ పురుషార్థం అవుతుంది. ఆ స్థితిలో ఈ అర్థ-కామ-ధర్మ పురుషార్థాలు అన్ని లీనమైపొతాయి.

స్వస్తి!

No comments:

Post a Comment